Get Ready To Taste ‘Mithai’ On February 22

‘మిఠాయి’ రుచిచూడాలంటే ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే!
సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి (రాహుల్ రామకృష్ణ) భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలో మునిగి తేలుతున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అందుకు ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగను పట్టుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే పెళ్లి జరగదు. అటువంటి సందర్భంలో స్నేహితుడు జానీతో (ప్రియదర్శి) కలిసి దొంగను పట్టుకోవడానికి సాయి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? సాయి దొంగను పట్టుకున్నాడా? లేదా? అసలు, ఆ దొంగ ఎవరు? సాయి పెళ్లి జరిగిందా? లేదా? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఫిబ్రవరి 22న విడుదలవుతున్న మా ‘మిఠాయి’ చిత్రం చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు ప్రశాంత్ కుమార్.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా రెడ్ యాంట్స్ బేనర్పై ప్రశాంత్కుమార్ స్వయంగా ఈ సినిమా నిర్మించారు. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆదిత్య మ్యూజిక్ ద్వారా టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. వినోదాత్మకంగా సాగే మా సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు వీక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
సాయి పనిచేసే కంపెనీ సీఈఓగా అజయ్ ఘోష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవివర్మ, అర్ష, శ్వేతావర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్, నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.