రష్మిక జోరు!

రష్మిక జోరు!
టాలీవుడ్ తాజా సంచలన తార రష్మికా మండన్న ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి.. మహేశ్ సరసన చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా, రెండోది.. నితిన్ జోడీగా నటిస్తోన్న ‘భీష్మ’. విజయ్ దేవరకొండ జోడీగా, క్రికెటర్ పాత్రలో ఆమె నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. అతనికిదే తొలి చిత్రం.
‘డియర్ కామ్రేడ్’లో రష్మిక పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని సమాచారం. ఇప్పటివరకూ తెలుగులో ఆమె చేసినవన్నీ కథకు కీలకమైన పాత్రలే. తొలి సినిమా ‘ఛలో’ కానీ, తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’లో కానీ రష్మిక.. హీరోకు సమాంతరమైన పాత్రలు చేసింది. మూడో సినిమా ‘దేవదాస్’లోనూ ఆమెది ప్రాధాన్యమున్న పాత్రే.
ఇప్పుడు తెలుగులో తన తొలి బ్లాక్బస్టర్ ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండతో రెండోసారి ‘డియర్ కామ్రేడ్’ చేసింది. ఇందులో విజయ్తో ఆమె లిప్లాక్ హాట్ టాపిక్గా మారింది. కథ డిమాండ్ ప్రకారమే ఆ సన్నివేశం చేశానని రష్మిక చెప్పుకుంది. సినిమా విడుదలైతే కానీ ఆమె మాటల్లో నిజమెంతో తెలీదు.
ఇప్పుడు ఏకంగా సూపర్స్టార్ మహేశ్ సరసన నటించే అవకాశం సంపాదించుకోవడంతో చాలా కాలంగా మహేశ్తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న తారలంతా అసూయ చెందుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ‘సరిలేరు’ సినిమాలో రష్మిక పాత్ర ఏమిటన్నది తెలీకపోయినా కథకు కీలకమైనదా, లేక కేవలం గ్లామరస్ రోలా అనే విషయంలో సందిగ్ధత ఉంది.
టాప్ స్టార్ సినిమాలో సాధారణంగా నాయిక పాత్ర చాలా పరిమితంగా కనిపిస్తుంది. ఎప్పుడో కానీ నాయికకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించదు. ‘సరిలేరు నీకెవ్వరు’లో రష్మిక కేవలం పాటలకీ, గ్లామర్కీ పరిమితమైతే ఆమెకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదనే చెప్పాలి. అదే తగిన ప్రాధ్యాన్యమున్న కేరెక్టర్ అయితే టాలీవుడ్లో ఆమె టాప్ హీరోయిన్గా ఎదగడానికి అది దోహదం చేస్తుంది. మహేశ్ జోడీగా ఆమె ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
రష్మిక జోరు! | actioncutok.com
More for you: