ఎండ దెబ్బకు ఉల్లి మందు!

ఎండ దెబ్బకు ఉల్లి మందు!
ఝబువా (మధ్యప్రదేశ్): మే నెల అంటేనే మండే ఎండాకాలం. ఎండ మండిపోతుండటంతో ఎన్నికల సంఘం అధికారులు తమ ఉద్యోగుల పట్ల చాలా జాగ్రత్తలే తీసుకుంటోంది. మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లా ఎన్నికల అధికారి ప్రబాల్ సిపాహా వడదెబ్బకు సరికొత్త మందు కనిపెట్టారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వంటి ఎన్నికల సామగ్రితో పాటు ఉల్లిపాయలను కూడా సిబ్బంది తమ వెంట తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.
ఉల్లిపాయలు తింటే దాహార్తి తీరుతుందని, డీ హైడ్రేషన్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. దీంతో ఆ జిల్లాలోని 981 పోలింగ్ కేంద్రాల ఉద్యోగులు తమ వెంట ఉల్లిపాయలు తీసికెళ్లారు. ఝబువా జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే నెలలో అక్కడ వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారి ఎన్నికల సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా ఈ చిట్కా కనిపెట్టారు.
మధ్యప్రదేశ్లోని ఎనిమిది లోక్ సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. దేవాస్, ఇండోర్, ఉజ్జయిని, మందసర్, రత్లాం, థార్, ఖర్గోనె, ఖండ్వా నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది.
ఎండ దెబ్బకు ఉల్లి మందు! | actioncutok.com
More for you: